మలక్పేట, జనవరి 4: దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతనిచ్చినట్టుగా దేశంలో ఏ రాష్ట్రం చేయటం లేదని వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఎవరికైనా, ఎలాంటి సందేహమున్నా.. అవసరమైతే వికలాంగుల సంఘాలు విజ్ఞాన యాత్రను ఏర్పాటు చేసుకొని వెళ్లి చూసిరావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే ఎక్క డ, ఏ ఒక్కటి అమలవుతున్నట్టు తెలిపినా, రాష్ర్టంలో అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు.
లూయీస్ బ్రెయిలీ 213వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మలక్పేట నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల జాతీయ ఉద్యానవనంలో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దివ్య దేవరాజన్, డైరెక్టర్, ఎండీ శైలజలతో కలిసి లూ యీస్ బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూతన బ్రెయిలీ క్యాలెండర్ను అవిష్కరించిన ఆయన, అంధ విద్యార్థినికి ఉచితంగా ల్యాప్టాప్ను అందజేశారు.
వచ్చే ఏడాదికి ఏడడుగుల పెద్ద విగ్రహం
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పార్కులో లూయీస్ బ్రెయిలీ విగ్రహం చాలా చిన్నదిగా ఉందని, వచ్చే ఏడాది జయంతి నాటికి ఏడడుగుల పెద్ద విగ్రహాన్ని పార్కు మధ్యలో ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వికలాంగుల సంక్షేమ కార్యాలయ ఆవరణలో ఆడిటోరియం నిర్మాణం చేపడుతామని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా, దివ్యాంగులకు ఉన్న రిజర్వేషన్ను తూచ తప్పకుండా అమలుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటివరకు ఇచ్చిన 1.35 లక్షల ఉద్యోగాల నియామకాల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరుగలేదని, పారదర్శకంగా జరిగిందన్నారు. దివ్యాంగుల బ్యాక్లాక్ పోస్టులను గుర్తించేందుకు టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేస్తామన్నారు.
కరీంనగర్లోని బధిరుల పాఠశాలను అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్, డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతామన్నారు. అదే విధంగా ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ల బలోపేతానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న ప్రస్తుత నిర్ణయం ప్రకారం ఇండ్లులేని పేదలు సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకుంటే ప్రభుత్వమే డబ్బులు ఇస్తదని, ఎవరైతే పూర్తిగా కట్టుకోలేని స్థితిలో ఉంటారో వారికి ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని ఆయన తెలిపారు. దివ్యాంగులు విన్నవించిన విషయాల్లో న్యాయబద్దమైన, సమంజసమైన వాటి పట్ల తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. అనంతరం, వికలాంగుల సంక్షేమ శాఖ భవనంలో ఏర్పాటుచేసిన వర్చువల్ మీటింగ్లో దివ్యాంగుల మంత్రి ముందు పలు విన్నపాలను విన్నవించారు.
దళిత బంధు మాదిరిగా దివ్యాంగులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తే దివ్యాంగులు ప్రయోజకులుగా మారుతారని, ఆర్టీసీ బస్పాసుల జారీ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటిని పరిష్కరించాలని సీనియర్ అడ్వకేట్, జాతీయ స్థాయి ఉత్తమ స్పీకర్ అవార్డు గ్రహీ త చందనా సుప్రియ మంత్రిని కోరారు. కార్యక్రమంలో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి దివ్య దేవరాజన్, శాఖ డైరెక్టర్, ఎండి శైలజ, జీఎం ప్రభంజన్రావు, మాజీ ఎమ్మెల్యే మోహన్రెడ్డి, నాయకులు గంగారాం, శ్రీశైలం, నారా నాగేశ్వర్రావు పాల్గొన్నారు.