శ్రీశైలం : దేవీ శరన్నవరాత్రి వేడుకలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజు మంగళవారం భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయనీగా భక్తులకు దర్శనమిచ్చారు. సింహవాహనంపై నాలుగు చేతుల్లో వరముద్రను, పద్మం, అభయముద్రలు, ఖడ్గాన్ని ధరించి అమ్మవారు శుభప్రదాయనీగా భక్తులను అనుగ్రహించారు. మరోవైపు అక్కమహాదేవి అలంకారమండపంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామివార్లు హంసవాహనంపై అధిష్టింపజేసి అర్చక వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రాకారోత్సవంలో స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులతో పాటు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులచే జానపదాలు, కోలాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కళాకారులతో సందడిగా ఉత్సవం కొనసాగింది. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగాయి. ప్రాకారోత్సవంలో కార్యనిర్వాహణాధికారి లవన్న, ఏసి నటరాజ్, ఈఈ మురళీ బాలకృష్ణ, పౌరసంభందాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, మల్లయ్య, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, పర్యావేక్షకుడు శ్రీహరి, సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, అయ్యన్న, రవి పాల్గొన్నారు.
నేడు కాళరాత్రి అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో ఏడవరోజు బుధవారం భ్రమరాంబాదేవి అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వగా మల్లికార్జున స్వామివారికి గజవాహన సేవ జరుగనుందని ఈవో లవన్న తెలిపారు.