గాజా స్ట్రిప్, మే 26: చాలా రోజుల తర్వాత హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేశారు. గాజా భూభాగం నుంచి ఆదివారం హమాస్ బలగాలు రాకెట్ల వర్షం కురిపించడంతో టెల్ అవివ్ నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు వినిపించాయి. ఈ ఏడాది జనవరి తర్వాత హమాస్ దీర్ఘశ్రేణి రాకెట్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తాజా రాకెట్ దాడులకు ఇజ్రాయెల్ సైన్యం స్పందించింది. రఫా ప్రయోగించిన రాకెట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చాయని, వాటిని అడ్డుకొన్నామని పేర్కొన్నది.
సర్ప్రైజ్లకు సిద్ధంగా ఉండండి!
గత ఎనిమిది నెలలుగా గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్కు ఇరాన్ మద్దతు గల హెజ్బొలా గ్రూపు ఆకస్మిక దాడులకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ సర్ప్రైజ్లకు సిద్ధంగా ఉండాలని లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొలా ప్రధాన కార్యదర్శి నస్రల్లా హెచ్చరికలు చేశారు. ‘మా ప్రతిఘటన నుంచి మీరు సర్ప్రైజ్ను ఊహించొచ్చు’ అని ఇజ్రాయెల్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లు గాజాలో బందీలుగా చేసిన వారిని వెనక్కు తీసుకురావాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ టెల్ అవివ్లో ప్రజలు ఆందోళనలు చేశారు.