సింగపూర్: భారత లోక్సభలోని ఎంపీల్లో సగంమంది నేరచరితులేనని, రేప్, మర్డర్ల వంటి అభియోగాలు వాళ్లపై ఉన్నాయని సింగపూర్ ప్రధాని లీ సియెన్ లూంగ్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కార్యకలాపాలు సాగించాలన్న అంశంపై సింగపూర్ పార్లమెంట్లో జరిగిన చర్చా కార్యక్రమంలో లీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నత ఆదర్శాలతో, సమున్నతమైన విలువలతో ఎందరో గొప్ప నేతలు దేశాలకు పునాదులు నిర్మించారని పేర్కొన్న ఆయన.. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూను ఈ సందర్భంగా ఉటంకించారు భారత్ను నెహ్రూ ఇండియాగా అభివర్ణించారు. జాతి నిర్మాణంలో పాలుపంచుకొన్న నేతలను ప్రస్తుత రాజకీయ వ్యవస్థలు గుర్తించడం లేదన్నారు. అప్పటి విలువలు ఇప్పుడు లేవన్నారు. లీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ అంశంపై భారత్లోని సింగపూర్ హైకమిషనర్కు గురువారం సమన్లు జారీ చేసింది.