కాళేశ్వరం జలాలతో మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. నాలుగు రోజులుగా ప్రవాహం వస్తుండటంతో ప్రాజెక్టులో క్రమంగా పెరిగి బుధవారం రాత్రి మత్తడి దుంకింది. ప్రాజెక్టు నుంచి వాగులోకి వస్తున్న నీళ్లు సుమారు కిలోమీటర్ మేర ప్రవహించి వెల్దుర్తి మండలంలోని హస్తాల్పూర్ శివారులోని చెక్డ్యామ్కు చేరుకొన్నాయి. అక్కడి నుంచి కిలోమీటర్ మేర ముందుకు వచ్చి వెల్దుర్తి శివారు గంగమ్మ దేవాలయ సమీపంలోని చెక్డ్యాంలోకి చేరుతున్నాయి. గురువారం మధ్యాహ్నానికి వెల్దుర్తి చెక్డ్యామ్ను తాకిన నీళ్లు.. అర్ధరాత్రి వరకు అలుగుపారనున్నది. అక్కడి నుంచి మరో చెక్డ్యాంలోకి నీళ్లు ప్రవహించనున్నాయి. ఓ వైపు ఎండలు భగభగ మండిపోతుండగా.. వెల్దుర్తి మండలంలోని హల్దీవాగులో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుంటే అన్నదాతలు సంబురపడుతున్నారు.
-వెల్దుర్తి