హైదరాబాద్ : కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)లో భాగంగా జగద్గిరిగుట్టలోని గురుకుల పాఠశాల, కాలేజీ భవన నిర్మాణానికి రూ.17కోట్లు మంజూరు చేసింది. హెచ్ఏఎల్ అధికారులు నగరంలో శనివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి తమ అంగీకార పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సంతోషం చేసి, హెచ్ఏఎల్ అధికారులను శాలువాలతో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో సీఎం కేసీఆర్ గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారన్నారు. వెయ్యి గురుకులాలలో సుమారు 6 లక్షల మందికి ఇంగ్లిష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మాయిలు తమ చదువులను మధ్యలోనే ఆపేయకుండా నిరాఘాటకంగా కొనసాగించేందుకు ప్రత్యేకంగా 30 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. ఇందులో భాగంగా కొనసాగుతున్న జగద్గిరిగుట్ట పాఠశాల, కాలేజీకి శాశ్వత భవనాన్ని సమకూర్చేందుకు కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హెచ్ఏఎల్ ముందుకు వచ్చి రూ.17కోట్లు మంజూరు చేయడం సంతోషదాయకమన్నారు.
మరిన్ని సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హెచ్ఏఎల్ అధికారులు సేవాభావాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్, కార్యదర్శి రోనాల్డ్ రాస్ కొనియాడారు. కార్యక్రమంలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ సర్కాటే, అధికారులు రామ్ కిశోర్, సురేందర్ జీ, జతీందర్ పాల్ కౌర్, ప్రహ్లాద్, గురుకుల విద్యా సంస్థల సొసైటీ అధికారులు హన్మంతు నాయక్, మామిడాల ప్రవీణ్ పాల్గొన్నారు.