హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆదివారం నామినేషన్లు స్వీకరించగా, గుత్తా ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. సోమవారం శాసనమండలి సమావేశం కాగానే ఉదయం 11 గంటలకు ప్రస్తుత చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ మండలి నూతన చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డిని లాంఛనంగా ప్రకటిస్తారు. అనంతరం ఆయన చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తారు. గతంలో 21 నెలలు మండలి చైర్మన్గా వ్యవహరించిన గుత్తాకు మరోసారి అవకాశం దక్కింది. నల్లగొండ లోక్సభ స్థానం నుంచి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన గుత్తా, రెండుసార్లు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రైతుబంధు సమితికి తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆదివారం ఉదయం 10.40 నిమిషాలకు శాసనసభ సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శి బీ నరసింహాచార్యుల వద్ద గుత్తా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున మంత్రులు, ఎమ్మెల్సీలు వేర్వేరు సెట్ల నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు, గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, భాను ప్రసాదరావు, శేరి సుభాష్రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎల్ రమణ, వీ గంగాధర్ గౌడ్, ఎగ్గె మల్లేశం, రఘోత్తంరెడ్డి, జనార్దన్రెడ్డి, దండె విఠల్, నవీన్కుమార్, అలుగుబెల్లి నర్సిరెడ్డి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాసర్రావు, భూపాల్రెడ్డి, జీవన్రెడ్డి, మెతుకు ఆనంద్, బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ తదితరులు హాజరయ్యారు.
సహకరించిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుకు కృషిచేస్తాను. చైర్మన్గా 21 నెలలు పనిచేసిన అనుభవంతో సభను నడిపిస్తాను. నల్లగొండ నుంచి మూడుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యే కోటాలో 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రజాజీవితంలో ఉన్న నేను, ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాను.
-గుత్తా సుఖేందర్రెడ్డి
మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్రెడ్డి అభ్యర్థిత్వానికి మండలిలోని అన్ని పక్షాలు మద్దతు తెలియజేస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లేఖలు సమర్పించాయి. గుత్తా సుఖేందర్రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి లేఖ రాశారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి గుత్తా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరై మద్దతు ఇవ్వటం విశేషం.
శాసనమండలి చైర్మన్గా తనకు రెండోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మంత్రి కేటీఆర్కు గుత్తా సుఖేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చైర్మన్ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే సభను హుందాగా నడిపించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. చైర్మన్గా 21 నెలలు పనిచేసిన అనుభవంతో సభను నడిపిస్తానని చెప్పారు. నల్లగొండ నుంచి మూడుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యే కోటాలో 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రజాజీవితంలో ఉన్న తాను, ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు.