నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజాకంఠక యాత్రగా మారిందని టీఆర్ఎస్ నేత, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు 20వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తుండడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. దేశంలో బీజేపీ ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకు తింటుందని విమర్శించారు. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం పెంచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. బీజేపీ నేతలు ఏనాడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడరని, వారికి తెలంగాణ ప్రయోజనాలు వారికి పట్టవన్నారు. సీఎం కేసీఆర్ను మించిన హిందువు ఎవరూ లేరని, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాల ప్రజలు కలిసిమెలసి జీవిస్తున్నారన్నారు. విభేదాలు సృష్టించి, ప్రజలను కొట్టుకునేలా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఆ పార్టీ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, బీజేపీ అధిష్ఠానం బండి సంజయ్ని కట్టడి చేయాలని సూచించారు.
రాష్ట్రంలో జీఎస్డీపీ పెరిగిందని, కేంద్రానికి ఇచ్చే ఆదాయంలో కూడా తెలంగాణ 6వ స్థానంలో నిలిచింది. ఇది అందరికీ గర్వకారణమన్నారు. ప్యాడి ప్రొడక్షన్ ఆదాయం రూ.47,440 కోట్లు వచ్చిందని, ఈ విషయాలు స్వయాన నీతి ఆయోగం తేల్చి చెప్పిందని, ఇవి బీజేపీ నేతలకు అర్థం కావన్నారు. కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని, ఓటుకు నోటుకు కేసులో దొరికిన దొంగల మాటలను ప్రజలు నమ్మొద్దని కోరారు. మతోన్మాద శక్తులు, బ్లాక్మెయిలర్లకు తెలంగాణలో స్థానం లేదన్నారు.