మహదేవపూర్, నవంబర్ 3: చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పి తమ భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువును మరువలేదు ఈ విద్యార్థులు. గురువు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని.. వెంటనే రూ.లక్ష సమీకరించి కిరాణ దుకాణం ఏర్పాటు చేయించి గురుదక్షిణ చెల్లించుకున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అంబట్పల్లికి చెందిన పూర్వ విద్యార్థులు. గ్రామానికి చెందిన ప్రైవేట్ టీచర్ బండి రామస్వామి 30 ఏండ్లుగా పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యాబోధన చేస్తూ ఎంతోమందిని తీర్చిదిద్దారు. కరోనా ప్రభావంతో ప్రైవేట్ స్కూళ్లు మూతపడగా టీచర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రామస్వామి కూడా ఉద్యోగం కోల్పోయి ఇంటి వద్ద ఉంటున్న విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆర్థికంగా సాయపడాలని భావించారు. 10 మంది కలిసి రూ.లక్ష మేర డబ్బులు సమీకరించుకొని అంబట్పల్లి ప్రధాన చౌరస్తాలో కిరాణదుకాణం ఏర్పాటు చేయించి బుధవారం ప్రారంభించారు. పెంచి పోషించిన తల్లిదండ్రులనే సరిగా పట్టించుకోని నేటి రోజుల్లో తమ గురువుపై ఉన్న గౌరవాన్ని చాటుకోవడమే గాకుండా ఆర్థికంగా అండగా నిలిచిన పూర్వ విద్యార్థులను పలువురు అభినందించారు.