ఎల్లారెడ్డిపేట, నవంబర్ 14: సింగాపూర్ వీసాల పేరుతో మోసానికి యత్నించిన నకిలీ ఏజెంటుకు ప్రజలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. వేములవాడ మండలం మల్లారం గ్రా మానికి చెందిన కొమ్ము తిరుపతి అనే గల్ఫ్ ఏజెంట్ వారం క్రితం అగ్రహారానికి వచ్చాడు. తన వద్ద సింగపూర్ కంపెనీ వీసాలున్నాయని, అక్కడ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని గ్రామస్థులతో చెప్పా డు. నెలకు రూ.50 వేల జీతం ఉంటుందని నమ్మించాడు. కావాల్సిన వారు పాస్పోర్ట్ కలర్ జిరాక్స్ ప్రతులివ్వాలని అడిగాడు. అతని మాటలు నమ్మిన గ్రామానికి చెందిన దనాల పర్శరాములుతోపాటు మరో తొమ్మిది మంది పాస్పోర్ట్ కలర్ జిరాక్స్లు ఇచ్చారు.
అనంతరం ఒక్కొక్కరూ రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నమ్మకం లేకపోతే తన వద్ద ఉన్న 500 గ్రాముల బంగారం బిస్కెట్ ఉంచుకోవాలని సూచించాడు. సింగాపూర్లో పని కుదిరాక తన బంగారం తీసుకెళ్తానని బుకాయించాడు. ఆ తర్వాత 4 రోజుల్లోనే 10 వీసాలు తెచ్చి చూపించాడు. అంత తొందరగా వీసాలు తేవడం తో కొందరికి అనుమానం వచ్చింది. వాటిపై ఆరా తీసి నకిలీ వీసాలని నిర్ధారణకు వచ్చారు. అనంతరం తిరుపతిని గ్రామానికి పిలిపించి, నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. వీసాలతోపాటు బంగారు బిస్కెట్ కూడా నకిలీదని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్థుల ఫిర్యాదుతో నిందితుడు కొమ్ము తిరుపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.