అహ్మదాబాద్: అరంగేట్రం సీజన్లోనే ఐపీఎల్ ట్రోఫీ ముద్దాడిన గుజరాత్ టైటాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. సొంతగడ్డపై విజయభేరీ మోగించిన గుజరాత్ సోమవారం జైత్రయాత్ర సాగించింది. అహ్మదాబాద్ వీధుల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ప్లేయర్లు, కోచ్లు ఇతర సహాయ సిబ్బందితో కలిసి డబుల్ డెక్కర్ బస్సులో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు.
ట్రోఫీని ప్రజలకు చూపుతూ ఉత్సాహంగా జట్టు సభ్యులు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ జట్టును అభినందించారు. ఈ సందర్భంగా ప్లేయర్ల సంతకాలతో కూడిన బ్యాట్ను తనకు బహుకరించిందని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. జట్టు యాజమాన్యం ముంబైలో ఉండడంతో మంగళవారం అక్కడ సంబరాలు జరుగనున్నాయి.
అద్భుత విజయం సాధించిన గుజరాత్ జట్టు సోమవారం తెల్లవారుజాము వరకు సంబరాల్లో మునిగింది. వేకువజామున 3 గంటల వరకు మైదానంలో.. అనంతరం హోటల్లో ఆనందోత్సాహాల్లో మునిగిన ప్లేయర్లు ఉదయం 6 గంటలకు తమ గదులకు చేరుకున్నారు.