అహ్మదాబాద్ : జన్మాష్టమి, వినాయక చవితి సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఎనిమిది మెట్రోనగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయంలో సడలింపులు ప్రకటించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలులోకి వస్తున్నది. జన్మాష్టమి సందర్భంగా ఈ నెల 30న తెల్లవారు జామున ఒంటి గంట నుంచి, సెప్టెంబర్ 9న అర్ధరాత్రి 12 గంటల నుంచి అహ్మదాబాద్, వడోదర, రాజ్కోట్, సూరత్, భావ్నగర్, జామ్నగర్, గాంధీనగర్, జునాగఢ్లో అమలులోకి వస్తుందని పేర్కొంది. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధ్యక్షతన కొవిడ్-19 పరిస్థితిపై రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
అలాగే 30న జన్మాష్టమి సంప్రదాయబద్దంగా జరిగే ఊరేగింపులకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా మండపాల్లో నాలుగు, ఇంట్లో రెండు అడుగుల వరకు ఎత్తున్న విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తున్నట్లు అధికారులు స్పష్టంచేశారు. ఆయా వేడుకల్లో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టంచేశారు. జనసమర్థం ఉన్న ప్రాంతాల్లో పూజలు, హారతి, ప్రసాదం పంపిణీకి మాత్రమే అనుమతి ఉంటుందని, సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి లేదని పేర్కొన్నారు.