న్యూఢిల్లీ, నవంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు మళ్ళీ ట్రాక్లోకి వచ్చాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను రూ.1.30 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ పన్ను విధానం అమలులోకి వచ్చిన జూలై 2017 తర్వాత ఒక్క నెలలో ఇంతటి స్థాయిలో వసూలవడం ఇదే రెండోసారి. అంతకుముందు ఏప్రిల్లో రూ.1.41 లక్షల కోట్ల మేర పన్ను వసూలైన విషయం తెలిసిందే. లక్ష కోట్ల రూపాయల కంటే అధిక పన్ను వసూలవడం వరుసగా ఇది నాలుగో నెల. గత నెలలో వసూలైన రూ.1,30,127 కోట్లలో సీజీఎస్టీ కింద రూ.23,861 కోట్లు, ఎస్జీఎస్టీ కింద రూ.30,421 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వసూలయ్యాయి.