చొప్పదండి, జనవరి 3: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలోని కేసీఆర్ వనం అద్భుతంగా ఉందని, ఈ వనం అభయారణ్యంగా మారుతుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. వెదురుగట్ట కేసీఆర్ వనాన్ని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి ఆయన సందర్శించారు. వనంలో నాటిన మొక్కల పెరుగుదలపై తీసుకొంటున్న జాగ్రత్తలపై అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణను పచ్చగా మార్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారంలో నాటిన మొక్కలతో రాష్ట్రం హరితమయంగా మారుతుందన్నారు. 172 ఎకరాల్లో నాటిన మొక్కలను సంరక్షిస్తూ మహారణ్యంగా మారుస్తున్న ఫారెస్ట్ అధికారులను వినోద్కుమార్ అభినందించారు.