బాబూజీగా ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5 న బిహార్ షాబాద్ జిల్లాలోని చాందా ప్రాంతంలో జన్మించారు. ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను, ఛీత్కారలను ఎదుర్కొన్నారు. దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. అతి చిన్న వయస్సులో(27 ఏండ్లకే) శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఆయన. పోలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయంలో రాణించి, అధికారం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం.
చిన్న ప్రాయంలో ఉండగానే తండ్రి చనిపోవడంతో సాంఘిక, ఆర్థిక ఇక్కట్ల మధ్య తల్లి వసంతీదేవి సంరక్షణలో తన చదువు కొనసాగించారు. ఆయన తన 11వ ఏట 1919లో ఏడవ తరగతి పాసయ్యారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్, కలకత్తా విశ్వవిద్యాయం నుంచి డిస్టింక్షన్లో బిఎస్సీ డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రుడయ్యారు. ఆయన తన పీజీ చదువు పూర్తి చేశారు. కార్మికుల కోసం పొరాడి 35వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీతో సుభాష్చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేకమంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు.
తొలుతగా 1942లో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగజ్జీవన్ రాం.. 1952లో భారత రిపబ్లిక్ తొలి లోక్సభ ప్రవేశించిన జగ్జీవన్రామ్ వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు. 1969లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో ఇందిరా గాంధీతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్’ పార్టీ ఏర్పాటు చేశారు. కొద్దిరోజులకే తన పార్టీని జనతాపార్టీలో విలీనం చేశారు.
1980లో కాంగ్రెస్(జే) పేరుతో పార్టీ స్థాపించి దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలకపాత్ర పోషించారు.ఏకధాటిగా 33 సంవత్సరాలు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆహార శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఎన్నో సేవలనందించారు.
ఆయన హిందీ, ఇంగ్లిష్లో రచనలు చేశారు. ‘భారత దేశంలో కులం సవాళ్ళు’, ‘జీవనసరళి వ్యక్తిత్వ వికాసం’ అను రెండు విశిష్ట గ్రంథాలను రచించారు. ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాయం 1967లో జగ్జీవన్రామ్కి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఆయన సేవను మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాయం 1968లో డాక్టరేట్తో సత్కరించింది. 1986 జూలై 6న ఆయన కన్నుమూశారు.
2008 : ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ఎంపికైన పార్వతి ఓమ్నాకుట్టన్
1998 : జపాన్లోని ఆకాషి కాక్యో వంతెనపై నిలిచిన అతి పొడవైన ట్రాఫిక్
1993 : నటి దివ్య భారతి అనుమానాస్పద మృతి
1986 : పశ్చిమ బెర్లిన్లోని లా బెల్లె నైట్క్లబ్లో బాంబు పేలి ముగ్గురు దుర్మరణం
1979 : దేశం మొట్టమొదటి నావల్ మ్యూజియం ముంబైలో ప్రారంభం
1964 : మొదటిసారి జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకున్న నావికాదళం
1957 : కేరళలో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలు
1955 : విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా
1949 : భారత్ స్కౌట్ అండ్ గైడ్ స్థాపన
1930 : ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించడానికి అనుచరులతో కలిసి దండి చేరుకున్న మహాత్మా గాంధీ