హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నోరు తెరిస్తే సమాఖ్య స్ఫూర్తి అంటూ నీతులు చెప్పే కేంద్రంలోని బీజేపీ సర్కారు, నదుల అనుసంధానం పేరుతో రాష్ర్టాల హక్కులను లాగేసుకొనేందుకు కుట్రలకు తెరలేపింది. రాష్ర్టాల అభ్యంతరాలను బేఖాతర్ చేస్తూ ఏకపక్షంగా నదుల అనుసంధానం చేపట్టేందుకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. కృష్ణా, పెన్నా, కావేరీ అనుసంధానంతోపాటు మరో నాలుగు ప్రాజెక్టులను ప్రకటించింది.
నదుల అనుసంధానంపై తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాలు ఆది నుంచీ అభ్యంతరాలు చెప్తున్నాయి. నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ వార్షిక సమావేశంలో జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముందే ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టాయి. అయినప్పటికీ కేంద్రం రివర్ లింకింగ్ ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు ప్రకటించి సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని మేధావులు మండిపడుతున్నారు.
లెక్కలు తేలకుండా లింకింగ్ ఎలా?
తొలుత నదుల్లో నీటి లభ్యతపై శాస్త్రీయ అధ్యయనం జరుగాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. నదుల అనుసంధానం వల్ల తమ నీటి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండాలని స్పష్టంచేస్తున్నది. బేసిన్ అవసరాలు తీరిన తరువాతే మిగుల జలాలను ఇతర ప్రాంతాలకు మళ్లించాలని తెగేసి చెప్పింది. ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా సైతం ఇవే డిమాండ్లు కేంద్రం ముందుంచాయి. దశాబ్దాల క్రితం, లిఫ్ట్ పథకాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని సమయంలో రూపొందించిన ప్రణాళికనే ఇప్పుడు కేంద్రం అమలు చేయాలని చూస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
ఇప్పటివరకు దేశంలోని నదుల్లో నీటి లభ్యతకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు లేవు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన కెన్-బెట్వా రివర్ లింక్ ప్రాజెక్టుపైనా సాగునీటి రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రాజెక్టును చేపట్టిందని విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు వల్ల బుందేల్ఖండ్కు ఎలాంటి ప్రయోజనం లేదని, భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్లో సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదమున్నదని యూపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.