తిరుపతి : గోకులాష్టమి ( Gokulashtami ) పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ( TTD ) వేంకటేశ్వర గోసంరక్షణ శాలలో శుక్రవారం ఉదయం గోపూజ మహోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర( EO Ravichandra ) గోశాలలోని శ్రీ వేణుగోపాలస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ‘ ఓం నమో వేంకటేశాయ’ మహామంత్రాన్ని 7 కోట్ల సార్లు జపించిన జప పుస్తకాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమాన్ని ఈవో సందర్శించారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు జి. భాను ప్రకాష్ రెడ్డి, జేఈవో ప్రభల గోపీనాథ్, గోశాల డైరెక్టర్ శివకుమార్, విజీవో గిరిధర్, ఇన్చార్జి డీఎల్వో వెంకట సుబ్బానాయుడు, భక్తులు పాల్గొన్నారు.
తిరుమలలో ఘనంగా గోకులాష్టమి వేడుకలు

తిరుమల : తిరుమలలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

శనివారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య తిరుమలలో ఉట్లోత్సవం కార్యక్రమం ఉంటుందని వివరించారు. శ్రీ మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారని వెల్లడించారు. ఈ కారణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు తెలిపారు.