జూలూరుపాడు, ఆగస్టు 25 : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే లక్ష్యంతో జూలూరుపాడు మండలంలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని మొత్తం 24 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాలు, పాఠశాలల ప్రాంగణాల్లో పంచాయతీకి 200 చొప్పున విస్తృతంగా మొక్కలు నాటారు. పాపకొల్లు–కొత్తూరు అలాగే జూలూరుపాడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఏవెన్యూ ప్లాంటేషన్లో చేపట్టిన కార్యక్రమంలో మండల పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, మహావృక్షంగా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పచ్చదనం పెంపొందించడం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్, ఏపీఓ రామారావు, టీఏ నాగమణి, ఎఫ్ఏ షరీఫ్, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.