dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ అంశంపై డీజీసీఏ (ద డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) దృష్టి సారించిందని, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న నిబంధనల్ని పరిశీలిస్తోందని మంత్రి అన్నారు.
అలాగే, కొత్త నిబంధనల రూపకల్పనపై దృష్టి సారించిందని తెలిపారు. ఇటీవల ఎయిరిండియా విమానం గాలిలో ఉండగా, కుదుపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. దీనికి గల కారణాలపై విచారించగా.. పైలట్ గంజాయి సేవించినట్లు తేలింది. పైలట్లు మత్తులో ఉండటం వల్ల విమాన ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు ఉంటుంది. అందువల్ల పైలట్లు ఇలా నిషేధిత డ్రగ్స్ తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని గుర్తించేందుకు డోప్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.
నిజానికి దీనికి సంబంధించి ఎప్పటినుంచో ఈ రూల్ ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పైలట్లలో 10 శాతం మందికి మాత్రమే ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించాలి. అయితే, ఇకపై ప్రతి పైలట్కు ఏడాదికోసారి తప్పనిసరిగా డోప్ టెస్ట్ నిర్వహించాలని భావిస్తోంది. అంటే, 100 శాతం మంది పైలట్లకు డోప్ టెస్టు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భద్రత, నిర్వహణపరమైన అంశాల్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వివరించారు.