న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతిపాదిచడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్ 11న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుపై అభ్యంతరాలు లేవనెత్తాయి. ప్రజల సమాచార గోప్యతా చట్టానికి సంబంధించిన ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నదని ఆరోపించాయి. జాతీయ భద్రత, ఇతర కారణాల పేరుతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్నదని విమర్శించాయి. ప్రజలపై ప్రభుత్వం నిఘా పెట్టే అవకాశమున్నదని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
దీంతో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పార్లమెంట్ జాయింట్ కమిటీ పరిశీలనకు ఈ బిల్లును పంపింది. 2021 డిసెంబర్ 16న ఈ కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పించింది. ఈ బిల్లుకు 81 సవరణలను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. పౌరుల డిజిటల్ డేటా రక్షణకు సంబంధించిన ఈ బిల్లును చట్టపరంగా సమీక్షించి కొత్తగా తిరిగి ప్రవేశపెడతామని చెప్పారు.
మరోవైపు వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు అనేక సాంకేతిక, విధానపరమైన సమస్యలను సృష్టిస్తుందని ఫేస్బుక్, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే, వ్యక్తుల అనుమతి, డేటా నిల్వకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నాయి.