న్యూఢిల్లీ : దేశంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సంబంధించిన కొవిడ్ టీకాల విషయంలో శాస్త్రీయ హేతుబద్ధత, సరఫరా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం), కొవిడ్ టాస్క్ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశంలో కొవిడ్ కేసుల తగ్గుదల సంతోషకరమైన విషయమని, కానీ.. దీనర్థం కరోనా ముగిసిందని కాదని స్పష్టం చేశారు. అనేక దేశాల్లో ఎక్కువ టీకాలు వేసిన తర్వాత సైతం రెండు కంటే ఎక్కువ కొవిడ్ వేవ్స్ వచ్చిన సందర్భాలున్నాయన్నారు.
ప్రస్తుతం దేశంలో మూడు టీకాలు కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వీ టీకాలు మాత్రం 18 సంవత్సరాల వయసుపైబడిన వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నారు. ఇవన్నీ రెండు డోసుల టీకాలు. జైడస్ క్యాడిలా సూది అవసరం లేకుండా వ్యాక్సిన్ను తయారు చేసింది. 12-18 సంవత్సరాల్లోపు పిల్లలకు అందుబాటులోకి వచ్చిన మొదటి టీకా నిలువగా.. అత్యవసర వినియోగ అధికారం సైతం డీసీజీఐ పొందింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. ‘పలు దేశాలు పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించాయని మాకు తెలుసు. శాస్త్రీయ ఫలితాలు, సరఫరా స్థితిని చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వ్యాక్సినేషన్ డ్రైవ్లో కొవాగ్జిన్ ముఖ్యపాత్రను పోషించింది. ఈ వ్యాక్సిన్ పిల్లలకు వేసేందుకు ఆమోదిస్తే.. మొదట అవసరాన్ని నిర్ధారించి, ఉత్పత్తి.. సరఫరా సమతుల్యతతో పిల్లలకు కొవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం’ అన్నారు. అయితే, టీకాల పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై ఎలాంటి కాలపరిమితి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కరోనా వ్యాప్తిలో పిల్లలు వాహకాలనీ, అయితే, పిల్లల కంటే ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుందని డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. పిల్లల్లో కరోనా లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయని, కొన్ని సందర్భాల్లో లక్షణాలు కూడా ఉండవన్నారు.
దేశంలో కరోనా రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘రోజువారీ సంఖ్య ఖచ్చితంగా తగ్గుతోంది. కానీ, మహమ్మారి పూర్తిగా ముగిసిపోయిందని దీనర్థం కాదు. ఎందుకంటే సెకండ్ వేవ్ తర్వాత కూడా పరిస్థితి భయంకరంగా మారుతున్న దేశాలను చూశాం. టీకాలు భారీగా వేసిన దేశాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం దేశంలో పండుగల సీజన్ కొనసాగుతుంది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ పరిస్థితులన్నింటిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది’ అన్నారు. దేశంలో సిరంజీల కొరత ఉందా? అని ప్రశ్నించగా.. దేశంలో ఎలాంటి కొరత లేదని, అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయని తెలిపారు.