న్యూఢిల్లీ: సోషల్ మీడియా నిబంధనలను మరింత కఠినం చేస్తామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం నేత జర్నా దాస్ బైద్యా ఒక ప్రశ్న అడిగారు. ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లామ్ఫారాల కోసం ఏదైనా నిబంధనలు, మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తున్నదా అన్నది మంత్రి చెప్పాలని కోరారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సభ ఏకాభిప్రాయంతో సోషల్ మీడియా నిబంధనలను కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సోషల్ మీడియాను మరింత జవాబుదారీగా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించని సోషల్ మీడియా సంస్థలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. ధిక్కరించేలా వ్యవహరించిన ట్విట్టర్పై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉదాహరణగా పేర్కొన్నారు. మహిళలను రక్షించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.
ఏదైనా అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే సోషల్ మీడియాను జవాబుదారీగా చేసేందుకు ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకున్న వెంటనే భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని విమర్శించారు. అది వాస్తవం కాదని, సమన్వయం కోల్పోకూడదని అన్నారు. సోషల్ మీడియాను జవాబుదారీగా చేసేందుకు ముఖ్యమైన ఐదు సోషల్ మీడియా మధ్యవర్తులను ప్రభుత్వం తప్పనిసరి చేసిందని చెప్పారు. అవన్నీ కూడా నెలవారీగా నివేదికలు సమర్పించాల్సి ఉందన్నారు.