కరీంనగర్ : వర్షాలు, వరదలతో వచ్చే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
గురువారం మంత్రి ప్రభుత్వ ప్రధాన దవాఖానను సందర్శించారు. వార్డుల్లో తనిఖీలు చేసారు. రోగులను పరమార్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన చర్యల పై వైద్యాధికారులకు సూచనలు చేసారు. క్యాంటీన్ పరిశీలించి..పలువురికి భోజనాన్ని వడ్డించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో విషజ్వరాలు,డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. జ్వరం వస్తే ప్లేట్ లెట్లు తగ్గడం సాధారణమే.
ప్లేట్ లెట్స్ తగ్గినంత మాత్రానా ప్రజలు భయాందోళనకు గురికావల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో మందులకు కొరత లేదని, ఎలాంటి పరిస్థితులు వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ వై సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, ఆర్ ఎమ్ ఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీమ్, తదితరులు పాల్గొన్నారు.