న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో తమ వాటాను మరింత తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఎఫ్ఫీవో (ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్)ను తీసుకురావాలని యోచిస్తున్నది. ఈ మేరకు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.
ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 96.5 శాతం వాటా ఉన్నది. 2022 మే నెలలో 3.5 శాతం వాటాను ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా అమ్మేసిన విషయం తెలిసిందే. షేర్ ధరల శ్రేణి రూ.902-949గా ఉండగా.. ఖజానాకు దాదాపు రూ.21,000 కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉంటే.. అన్ని అనుమతులూ లభిస్తే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎల్ఐసీ ఎఫ్పీవో రావచ్చని నాగరాజు చెప్పారు.