ఢిల్లీ ,మే 30: కోవిడ్ బారినపడి మరణించినవారి కుటుంబాలు చక్కని జీవన ప్రమాణాలతో, గౌరవప్రదంగా జీవించడానికి కేంద్ర ప్రభుత్వం సాయపడుతుంది. ఈ మేరకు చనిపోయిన ఉద్యోగులకు వర్తించే ‘ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ’ (ఈఎస్ఐసీ) పెన్షన్ పథకం ప్రయోజనాన్ని ఆయా కుటుంబ సభ్యులకూ అందించనున్నది. తదనుగుణంగా ప్రస్తుత నిబంధనల ప్రకారం మరణానికి ముందు పోషకులైన కార్మికులు ఆర్జించే రోజువారీ సగటు వేతనంలో 90 శాతానికి సమానమైన మొత్తాన్ని కుటుంబంలో ఆధారపడినవ్యక్తులకు పెన్షన్ రూపంలో చెల్లిస్తుంది. ఇలాంటి కుటుంబాలకు వెనుకటి తేదీనుంచి… అంటే 2020 మార్చి 24వతేదీ నుంచి 2022 మార్చి 24వతేదీ ల మధ్య సంభవించే సంఘటనల్లో ఈ ప్రయోజనాన్ని వర్తింపజేస్తుంది.‘ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్ఓ)- ‘ఉద్యోగుల డిపాజిట్ సంధానిత బీమా పథకం’ (ఈడీఎల్ఐ) అమలు:
‘ఈడీఎల్ఐ’ పథకం కింద బీమా ప్రయోజనాల పెంపుసహా ఈ ప్రక్రియ సరళీకరించారు. ఇతరత్రా లబ్ధిదారులకు మాత్రమే కాకుండా ముఖ్యంగా కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకూ ఇది చేయూతనిస్తుంది. గరిష్ఠ బీమా ప్రయోజన మొత్తం రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచబడింది. కనీస బీమా లబ్ధిపై రూ.2.5 లక్షల పరిమితి నిబంధన పునరుద్ధరణతోపాటు వెనుకటి తేదీనుంచి… అంటే- 2020 ఫిబ్రవరి 15 నుంచి రాబోయే మూడేండ్ల పాటు అమలులోకి వచ్చినట్లు పరిగణించనున్నారు.
కాంట్రాక్టు,తాత్కాలిక కార్మిక కుటుంబాలకు ప్రయోజనం దిశగా ఒకే సంస్థలో కొనసాగి ఉండాలన్న నిబంధన ను కూడా సరళీకరించారు. అంతేకాకుండా కోవిడ్ వల్ల మరణించిన ఉద్యోగులు అంతకుముందు 12 నెలల వ్యవధిలో సంస్థలు మారి ఉన్నప్పటికీ, వారి కుటుంబాలకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. ఈ పథకాలన్నిటికీ సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను కేంద్ర కార్మిక-ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ జారీ చేయనుంది.