పహాడీషరీఫ్ :నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ కేంద్రంలోని మరాఠా పంక్షన్హాల్లో జాబ్మేళా నిర్వహించారు. ఈ జాబ్మేళాలో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి జాబ్ మేళాను ప్రారంభించారు.
ఇంటర్వ్యూలో అర్హత సాధించిన యువతీ, యువకులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు, పరిశ్రమలకు మద్య గ్యాప్ను పుల్ చేయడానికి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామన్నారు. నిరుద్యోగిగా ఉండకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకొని తమ కుటుంభాలను పోషించుకోవాలన్నారు. గత 6 సంవత్సరాలలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15వేల ఇండస్ట్రీలను తీసుకొచ్చిందన్నారు. సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఇటీవలనే తుక్కుగూడ, షాద్నగర్ తదితర ప్రాంతాలలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పరిశ్రమలు ప్రారంభించారన్నారు.
స్థానికంగా ఉన్న వారికే ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో అందుకనుగుణంగా ఇటీవల జాబ్మేళాలు నిర్వహించామన్నారు. మహేశ్వరంలో 850 మంది నిరుద్యోగ యువతీ, యువకులు రాగా 740 మందికి, కందుకూరులో 852 మందికి గాను 740 మంది, ప్రస్తుతం జల్పల్లిలో 942 మందికి గాను 796 మంది ఉద్యోగాలు సంపాదించుకున్నారన్నారు. చాలా మంది ఉపాది కోసం జాబ్ మేళాకు వస్తున్నారన్నారు. త్వరలో మైనార్టీలకు సంబంధించి ప్రత్యేకంగా జాబ్మేళాలు నిర్వహించాల్సి ఉందన్నారు. నిరుద్యోగులకు నైపుణ్యం లేకున్నా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, పిడి డీఆర్డీఏ ప్రభాకర్, జేడీఎం హమీద్, మేనేజర్ క్రాంతి కుమార్, మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, కౌన్సిలర్లు బుడుమాల యాదగిరి, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, షేక్ పహిమిదా అప్జల్, శంషోద్దీన్, అహ్మద్ కసాది, నాయకులు హసన్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.