నానక్రాంగూడలో శంకుస్థాపన చేసిన కేటీఆర్.. గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం
యువత, మహిళా పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ.. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ సాధికారతకు ఊతం డిజిటల్ తెలంగాణకు బలం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్.. ఇప్పుడు గూగుల్. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ దిగ్గజ కంపెనీలకు హైదరాబాద్ నగరం శాశ్వత కూడలి అవుతున్నది. అనేకచోట్ల తాత్కాలిక, అద్దె భవనాల్లోనే కొనసాగే ఈ కంపెనీలు.. హైదరాబాద్లో మాత్రం సువిశాలమైన సొంత క్యాంపస్లు నిర్మించుకొంటున్నాయి. ప్రపంచ టాప్ టెన్ టెక్ కంపెనీల్లో ఒకటైన గూగుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలిలోని నానక్రాంగూడలో అంకురార్పణ జరిగింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గూగుల్ క్యాంపస్కు ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు గురువారం శంకుస్థాపన చేశారు. 7.3 ఎకరాల్లో 30 లక్షల 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే సువిశాల భవన నమూనాను ఆవిష్కరించారు. అమెరికాలోని మౌంటెన్వ్యూలో ఉన్న గూగుల్ ప్రధాన కార్యాలయం తరువాత హైదరాబాద్ క్యాంపసే అతి పెద్దది. ఈ భవనంలో సుస్థిరత్వం, ఇంధన సామర్థ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నైపుణ్యంగల టెక్ వర్క్ఫోర్స్కు అరోగ్యకర, సహకార వర్క్ప్లేస్ను ఈ క్యాంపస్ అందించనున్నది. ఈ సందర్భంగా గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకొన్నది.
హైదరాబాద్లో గూగుల్ శాశ్వత క్యాంపస్ నిర్మాణంతో ‘డిజిటల్ తెలంగాణ’లక్ష్యానికి మరింత బలం చేకూరనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్కు ఉన్న ఉజ్వల భవిష్యత్తు, ఇక్కడి నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఇక్కడ తన మూలాలను మరింత పదిలం చేసుకొంటున్నందుకు సంతోషంగా ఉన్నదని తెలిపారు. గూగుల్ 2017 నుంచి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నదని చెప్పారు. డిజిటల్ తెలంగాణ ఆలోచనకు మద్దతు ఇవ్వడంతోపాటు డిజిటల్ రంగంలో పౌరులు సాధికారత సాధించాలనే పరస్పర లక్ష్యాన్ని సాధించడానికి గూగుల్ తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. గూగుల్తో జరిగిన మునపటి ఒప్పందాలు అన్ని వర్గాల్లో సానుకూల మార్పులు తెచ్చే గొప్ప కార్యక్రమాలకు దోహదపడ్డాయని చెప్పారు. తాజా ఒప్పందం యువత, మహిళలు, విద్యార్థులు, పౌరసేవల్లో సమూల మార్పులకు శ్రీకారం చుడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.
భారత్లో గూగుల్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి హైదరాబాద్ నగరం తమ అతిపెద్ద ఉద్యోగ స్థావరాల్లో ఒకటిగా ఉన్నదని గూగుల్ ఇండియా కంట్రీ హెడ్, ఉపాధ్యక్షుడు సంజయ్ గుప్తా తెలిపారు. తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని చెప్పారు. తాజా ఒప్పందం ద్వారా యువత ఉపాధికి సరైన నైపుణ్య శిక్షణ, డిజిటల్ నైపుణ్యాల్లో మహిళా పారిశ్రామికవేత్తలకు సహకారం, ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి గూగుల్ మద్దతు ఇస్తుందని వివరించారు.
ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లోని అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ నగరం స్వర్గధామంగా, అతిపెద్ద కూడలిగా మారింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఇక్కడ సొంత క్యాంపస్లు ఏర్పాటుచేసుకొన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని నానక్రాంగూడలో అమెజాన్ సొంత క్యాంపస్ నిర్మించింది. ఇక్కడ 3-5 వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియన్ బిజినెస్ స్కూల్ సమీపంలో 53 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించింది. ఇందులో 8 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంట్రోల్ ఎస్ కూడా తన డాటా సెంటర్ను నగరంలోనే నిర్మించింది. తాజాగా గూగుల్ తన రెండో అతి పెద్ద క్యాంపస్ను 7.3 ఎకరాల్లో నిర్మించనున్నది. రెండేండ్లలో ఇది అందుబాటులోకి రానున్నదని అంచనా. ఇందులో 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ ద్వారా ఐటీ సపోర్ట్, ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డాటా అనలిటిక్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ తదితర రంగాల్లో యువతకు శిక్షణనిస్తుంది. వీ-హబ్తో కలిసి మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల వ్యవస్థాపకులకు గూగుల్ నానో ద్వారా వ్యాపార, డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలను అందించనున్నది. ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ పాఠశాలలు డిజిటల్ విద్యలో సాధికారత సాధించేలా తోడ్పాటు అందించటం. ఈ-లెర్నింగ్పై విద్యార్థులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు.