హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): భానుడి భగభగల్ని భరించలేక ఏసీలను ఎడాపెడా కొనేస్తున్నారంతా. ఈ సమ్మర్ సీజన్లో ఇప్పటిదాకా ఎయిర్ కండీషనర్ల కొనుగోళ్లు భారీగా జరిగినట్టు తేలింది. ప్రజలు ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు జస్ట్డయల్ పరిశీలనలో స్పష్టమైంది. అలాగే విద్యుత్తు కోతల మధ్య దేశంలోని ఆయా మెట్రో నగరాల్లో ఇన్వర్టర్లకూ పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో 35 శాతం మంది ఇన్వర్టర్ల కోసం శోధించినట్టు జస్ట్డయల్ తెలిపింది. జస్ట్డయల్ కన్జ్యూమర్ ఇన్సైట్స్ తాజా వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్లో ఏసీలు, ఇన్వర్టర్ల కోసం దేశవ్యాప్తంగా 62 శాతం శోధనలు పెరిగాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 23 శాతం పెరుగుదలే కనిపించింది.
దేశవ్యాప్తంగా ఏసీల డిమాండ్ 53 శాతం పెరిగింది. వోల్టాస్, డైకిన్, బ్లూస్టార్, ఓ జనరల్, మిత్సుబిషి ఎలక్ట్రిక్, హిటాచీ, ఎల్జీ, లాయిడ్ తదితర బ్రాండ్లు టాప్-10 బ్రాండ్లలో ఉన్నాయి. ఇన్వర్టర్లలో లూమినస్, మైక్రోటెక్, వీగార్డ్, సు-కామ్, జెనస్, ఎక్సైడ్, అమరాన్, యుటీఎల్, ఏపీసీ, స్మార్టెన్ తదితర బ్రాండ్లు అత్యధికంగా శోధించిన టాప్-10 బ్రాండ్లుగా నమోదయ్యాయి. కాగా, ఈ-కామర్స్ ఎకో సిస్టంకు జస్ట్డయల్ తోడుగా ఉన్నందునే ఆయా సంస్థలకు డిమాండ్ పెరుగుతున్నదని, కొత్త కస్టమర్లు వస్తున్నారని జస్ట్డయల్ సీఎంవో ప్రసూన్ పేర్కొన్నారు.
ఏసీల సర్వీసింగ్కు 18 శాతం డిమాండ్ పెరగగా, ఇన్వర్టర్ల డిమాండైతే ఏకంగా 48 శాతం నుంచి 101 శాతానికి ఎగబాకింది. ప్రథమ శ్రేణి నగరాలతో పోల్చితే ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇన్వర్టర్లకు డిమాండ్ అధికంగా ఉన్నది. టైర్-2 నగరాల్లో ఈ జనవరి-మార్చిలో ఇన్వర్టర్ల డిమాండ్ 75 శాతం పెరగగా, ఏప్రిల్లో 146 శాతం ఎగిసింది. ఇక టైర్-1 నగరాల్లో తొలి మూడు నెలలు డిమాండ్ స్థిరంగా ఉన్నప్పటికీ.. ఏప్రిల్లో 19 శాతానికి పెరిగింది. ఇన్వర్టర్ల కోసం శోధించిన టైర్-1 నగరాల్లో ఢిల్లీ 28 శాతంతో ప్రథమ స్థానంలో ఉండటం గమనార్హం. కాగా, జైపూర్, చండీగఢ్, లక్నో, సూరత్, లుధియానా, కాన్పూర్, వడోదర, ఇండోర్, రాజ్కోట్, విజయవాడ వంటి పలు టైర్-2 నగరాల్లో ఇన్వర్టర్ల డిమాండ్ 146 శాతం పెరిగింది.