గోల్డెన్ గర్ల్ మీరాబాయి చాను మరోసారి సత్తాచాటింది! ‘నాకు నేనే పోటీ’ అని కామన్వెల్త్కు ముందే ప్రకటించిన చాను.. యావత్ భారతావని ఆశలు నెరవేరుస్తూ బర్మింగ్హామ్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ప్రత్యర్థుల నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాకపోవడంతో మీరాబాయి పసిడి పతకం ఖాతాలో వేసుకుంది. టోక్యో ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసి అభిమానులను అలరించిన చాను.. జపాన్లో ఎక్కడ ఆపిందో.. బర్మింగ్హామ్లో అక్కడి నుంచే మొదలెట్టింది. గాయంతో ఇబ్బంది పడుతూనే సంకేత్ రజత పతకంతో భారత పతకాల ఖాతా తెరువగా.. గురురాజ కాంస్యం కొల్లగొట్టాడు. ఫలితంగా కామన్వెల్త్ పోటీల రెండో రోజు భారత్ మొత్తం మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది. ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ నేటి నుంచి తన పోరాటం ప్రారంభించనుంది.
పూట గడవాలంటే పనికి వెళ్లాల్సిందే! కుటుంబం సంతోషంగా ఉండాలంటే.. తండ్రికి చేదోడు వాదోడుగా నిలువక తప్పని పరిస్థితి! ఇలాంటి క్లిష్ట సమస్యలే అతడిలో అగ్గి రాజేశాయి. తెల్లవారుజామునే నిద్రలేచి తండ్రి టీ కొట్టు వద్దకు వెళ్లి.. కస్టమర్లకు చాయ్లిచ్చిన ఆ కుర్రాడు.. కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి రజత పతకం అందించాడు. రోజంతా ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా కుటుంబం కోసం అహర్నిశలు కృషి చేసిన 21 ఏండ్ల మరాఠి కుర్రాడు.. బర్మింగ్హామ్లో బాక్స్ బద్దలు కొట్టాడు. తానెదుర్కొన్న సమస్యల ముందు ఈ బరువు ఒక లెక్కా అన్నట్లు రెచ్చిపోయిన సంకేత్ సర్గర్.. 2022 కామన్వెల్త్ గేమ్స్లో రజతంతో భారత పతకాల ఖాతా తెరిచాడు!
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల రెండో రోజు భారత లిఫ్టర్లు అదుర్స్ అనిపించారు. స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణంతో దేశాన్ని గర్వపడేలా చేస్తే.. సంకేత్ రజతంతో ఆకట్టుకున్నాడు. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను 201 కేజీల బరువెత్తి కామన్వెల్త్ రికార్డు బద్దలు కొట్టింది. స్నాచ్లో 88 కేజీలు ఎత్తిన మీరాబాయి.. క్లీన్ అండ్ జర్క్లో 113 కేజీలు ఎత్తింది. మారియా హనిత్ర (172 కేజీలు; మారిషస్), హన్నా కమన్స్కీ (171 కేజీలు; కెనడా) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు.
రెండో స్థానంలో నిలిచిన మారియా కంటే.. చాను 29 కేజీల ఎక్కువ బరువెత్తిందంటే.. ఈ విభాగంలో భారత లిఫ్టర్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో చాను కామన్వెల్త్ స్నాచ్ రికార్డును బద్దలు కొట్టింది. టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం గెలిచిన మీరాబాయి.. తాజా పోటీల స్నాచ్లో తొలి ప్రయత్నంలో 80 కేజీల బరువెత్తింది. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 84 కేజీలెత్తిన చాను మూడోసారి 88 కేజీలు ఎత్తిపడేసింది. అనంతరం 90 కేజీల కోసం ప్రయత్నించి విఫలమైంది. ఇక క్లీన్ అండ్ జర్క్ తొలి ప్రయత్నంలో 109 కేజీలను అలవోకగా ఎత్తిపడేసిన చాను.. ఆ తర్వాత 113 కేజిలెత్తింది.
పురుషుల 55 కేజీల విభాగంలో యువ లిఫ్టర్ సంకేత్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. స్వర్ణంపై గురిపెట్టిన సంకేత్ 248 కేజీల బరువుతో రెండో స్థానంలో నిలిచాడు. స్నాచ్లో 113 కేజీలెత్తిన సంకేత్.. క్లీన్ అండ్ జర్క్లో 135 కేజీలు ఎత్తాడు. గాయం కారణంగా చివర్లో తడబడటంతో ఒక్క కేజీ తేడాతో పసిడి పట్టే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
మహమ్మద్ అనిఖ్ 249 (107+142) కేజీలు, దిలంక ఇసురు కుమార 225 (105+120) కేజీలు వరుసగా స్వర్ణ, కాంస్యాలు గెలుచుకున్నారు. ‘బరువెత్తే సమయంలో ఎలాంటి తప్పులు చేయలేదు. అయితే ఒక్కసారిగా కుడి మోచేతిపై అధిక బరువు పడ్డట్లు అనిపించింది. దీంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ప్రాక్టీస్లో ఇంతకు మించిన బరువులు సునాయాసంగా ఎత్తేవాడిని. నా ప్రదర్శనతో సంతృప్తిగా లేను. కామన్వెల్త్ కోసం గత నాలుగేండ్లుగా కఠోర శిక్షణ కొనసాగించా. దేశం కోసం ప్రాణాలిర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు ఈ పతకాన్ని అంకితమిస్తున్నా’ అని సంకేత్ పేర్కొన్నాడు.
పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజా పూజారి సత్తాచాటాడు. గోల్డ్కోస్ట్ (2018) కామన్వెల్త్ క్రీడల్లో రజతం నెగ్గిన గురురాజా.. తాజా పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. శనివారం పోటీల్లో గురురాజ ఓవరాల్గా 269 కేజీలు (118+151) ఎత్తాడు. ఈ విభాగంలో మలేషియాకు చెందిన అజ్నిల్ బిన్ మహమ్మద్ 285 (127+158) స్వర్ణం నెగ్గగా.. మోరియా 273 (121+152; పపువా న్యూ గినియా) రజతం కైవసం చేసుకున్నాడు.
తొలిపోరులో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. రెండో పోరులో శ్రీలంకను చిత్తుచేసింది. తద్వారా స్టార్ షట్లర్లతో కూడిన మన టీమ్.. కామన్వెల్త్ గేమ్స్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. గ్రూప్-‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన మనవాళ్లు 5-0తో లంకను చిత్తుచేశారు.
భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ పురుషుల 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఫైనల్కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీస్లో శ్రీహరి 54.55 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. హీట్స్లో నాలుగోస్థానంతో సెమీస్కు అర్హత సాధించిన శ్రీహరి.. ఆదివారం పతకం కోసం పోటీ పడనున్నాడు. మరోవైపు పురుషుల 200 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్స్లో కుషాగ్ర రావత్ చివరి స్థానంలో నిలిచాడు. 50 మీటర్లలో సజన్ ప్రకాశ్, 400 మీటర్ల ఫ్రీస్టయిల్లో కుషాగ్ర రావత్ నిరాశ పరిచారు.
టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ప్యాడ్లర్ల హవా కొనసాగుతున్నది. మహిళల టీమ్ ఈవెంట్ గ్రూప్-2లో భారత్ 3-0తో గయానాను చిత్తు చేసింది. గోల్డ్కోస్ట్ (2018) కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గిన మహిళల టీమ్ అదే జోరులో
వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది.