న్యూఢిల్లీ, జనవరి 20: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం స్తబ్ధుగా ఉన్న పుత్తడి మార్కెట్లో ఇప్పుడు వేగంగా కదలికలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో తులం పసిడి విలువ మరోసారి రూ.50 వేలకు చేరువవుతున్నది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర బుధవారంతో పోల్చితే గురువారం రూ.500 ఎగబాకి రూ.49,700లకు చేరింది. ఆభరణాలకు అనువైన 22 క్యారెట్ల గోల్డ్ రేటు కూడా రూ.450 ఎగిసి రూ.45,550ని తాకింది. కిలో వెండి ధర కూడా ఒక్కరోజే రూ.1,500 పుంజుకుని రూ.68,800 వద్ద నిలిచింది. మరోవైపు ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.415 పెరిగి రూ.48,327ను తాకింది. కిలో వెండి ధర రూ.858 అందుకుని రూ. 64,429 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,841 డాలర్లు పలికింది. వెండి 24.13 డాలర్లుగా ఉన్నది.
ఎందుకీ పెరుగుదల?
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పట్లాగే సురక్షిత పెట్టుబడుల సాధనం బంగారం వైపు చూస్తున్నారు. దీంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి ధరలు పరుగులుపెడుతున్నాయి.