న్యూఢిల్లీ, మార్చి 13: గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అమెరికాలో ఒకేసారి రెండు బ్యాంకులు మూతపడటంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీల నుంచి సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో ఒక్కసారిగా ధరలు పుంజుకున్నాయి. దీంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.970 అధికమై రూ.56,550 పలికింది. అంతకుముందు ధర రూ.55,580గా ఉన్నది. పసిడితోపాటు వెండి భారీగా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో కిలో వెండి ఏకంగా రూ.1,600 అధికమై రూ.63,820 పలికింది.
ఇటు హైదరాబాద్లోనూ పసిడి, వెండిలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.330 అధికమై రూ.57 వేల పైకి రూ.57,2220కి చేరుకున్నది. అలాగే 22 క్యారెట్ల ధర కూడా రూ.290 పెరిగి రూ.52,450 పలికింది. రూ.800 పెరిగిన కిలో వెండి రూ.69,500గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ఔన్స్ ధర 1,915 డాలర్లు పలుకగా, వెండి 21.90 డాలర్లగా నమోదైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత ఐదు వారాలుగా స్థిరంగా ఉన్న బులియన్ ధరలు..2008 ఆర్థిక సంక్షోభం తర్వాత మళ్లీ అమెరికాలో రెండు బ్యాంకులు కుప్పకూలడంతో ఒక్కసారిగా ధరలు భగ్గుమన్నాయన్నారు.