హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేవాదుల పంప్హౌస్, కాకతీయ క్రాస్ రెగ్యులేటరీని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు అప్పగించేది లేదని తెలంగాణ అధికారులు స్పష్టంచేశారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని పేర్కొన్నారు. జలసౌధలో బుధవారం జీఆర్ఎంబీ సబ్కమిటీ కన్వీనర్ బీపీ పాండే అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణకు చెందిన దేవాదుల పంప్హౌస్, కాకతీయ క్రాస్ రెగ్యులేటర్తోపాటు ఏపీకి చెందిన తొర్రిగడ్డ లిఫ్ట్, చాగల్నాడు లిఫ్ట్ స్కీమ్ పంప్హౌస్లపై చర్చించారు. సబ్కమిటీ మెంబర్లను భాగస్వాములుగా చేయకుండా ప్రాజెక్టులను ఎలా సందర్శిస్తారని, ఆ ప్రాజెక్టులను స్వాధీనం చేస్తున్నట్టు అంగీకరించాలని ఎలా అడుగుతారని నిలదీశారు.
పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలనే జీఆర్ఎంబీకి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దేవాదుల పంప్హౌస్, కాకతీయ క్రాస్ రెగ్యులేటర్కి సంబంధించిన డీపీఆర్లు, రికార్డులు, ఇతర సమాచారాన్ని అందజేయాలన్న ఆదేశాలేవీ లేవని, ఆ వివరాలు ఇవ్వలేమన్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్లోని 2వ షెడ్యూల్ నుంచి దేవాదుల పంప్హౌస్, కాకతీయ క్రాస్ రెగ్యులేటరీని తొలగించాలని కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి చేసిందని, దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డులోని క్లాజ్-4 ప్రకారం కేటాయించిన నీటిని ఎక్కడైనా వినియోగించుకునేలా బేసిన్లోని రాష్ర్టాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని, ఆ నీటిని ఓ బేసిన్ నుంచి మరో బేసిన్కు తరలించుకెళ్లేందుకు కూడా రాష్ర్టాలకు పూర్తి హక్కులున్నాయని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు తరలించేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే పలు ప్రాజెక్టులను చేపట్టిందని వివరించారు.
వీటిపైనే రాష్ట్ర పునర్విభజన తర్వాత ఏపీ అభ్యంతరాలు చెప్తున్నదని, ఏపీవన్నీ తొండి వాదనలని కొట్టిపారేశారు. గోదావరిపై తెలంగాణ, ఏపీకి ఉమ్మడి ప్రాజెక్టులేవీ లేవని, వాటికి కేంద్ర బలగాలతో భద్రత అనవసరమని స్పష్టంచేశారు. సమావేశంలో జీఆర్ఎంబీ మెంబర్ కుటియాల, సీఎం ఓఎస్డీ, సబ్ కమిటీ మెంబర్ శ్రీధర్రావు దేశ్పాండే, అంతరాష్ట్ర జలమండలి సీఈ కోటేశ్వర్రావు, ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, జెన్కో సీఈ, ఏపీ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ అభ్యంతరాలతో సబ్కమిటీ సమావేశాన్ని మరోతేదీన నిర్వహించాలని నిర్ణయించారు.