భద్రాచలం, డిసెంబర్ 23: భద్రాచలం గోదావరి తీరం గురువారం శోభాయమానమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం గోదావరి మాతకు నదీ హారతులు, దీపోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా దేవస్థానం అర్చకులు గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు, చీరె, జాకెట్ సమర్పించి పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో బానోత్ శివాజీ దంపతులు ‘జై శ్రీరామ్’ ఆకారంలో దీపాలను అమర్చి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శివాజీ, ఇరిగేషన్ ఈఈ రామ్ప్రసాద్ మాట్లాడుతూ మానవాళి మనుగడ కోసం నదులు అవసరం ఎంతో ఉందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆస్థాన అర్చకులు, వైదిక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.