హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా ‘గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA)’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘GTA మెగా కన్వెన్షన్ 2025’ ఘనంగా జరుగుతున్నది. హైదరాబాద్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అక్షయ కన్వెన్షన్లో డిసెంబర్ 27, 28 తేదీల్లో రెండు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
తొలిరోజు ఈ వేడుకలో త్రిదండి చినజీయర్ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు శోభ చేకూర్చారు.
ఈ కన్వెన్షన్ కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
నిర్వాహక బృందం
GTA ఫౌండర్ & గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, USA ఫౌండర్ చైర్మన్ విశేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడూరు, USA ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి కన్వెన్షన్ నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
కార్యక్రమ హైలైట్స్
రెండో రోజు..
మాస్టర్క్లాసులు & చర్చలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్, స్టార్టప్లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ కింద రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం లాంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.
ముగింపు కార్యక్రమం
డిసెంబర్ 28న సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుంది. లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, GTA కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్తో ఈ వేడుకలు ముగియనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చిన ఈ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి.