హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రశంసించడం బాగుంది. ప్రశంసలతో పాటు పైసలు కూడా ఇస్తే బాగుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాజ్యసభలో జలమంత్రిత్వ శాఖ పనితీరుపై మంగళవారం జరిగిన చర్చలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణపై ప్రశంసలు కురింపించడంపై మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్యసభలో తెలంగాణ ప్రభుత్వం పనితీరును గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తున్నదని తెలిపారు.
అయితే గతంలోనూ వంద శాతం ఆవాసాలకు, ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, అన్ని స్కూల్స్, అంగన్ వాడీ కేంద్రాలకు మంచినీరు అందిస్తున్న రాష్ట్రంగా, ఫ్లోరైడ్ రహిత, శుద్ధి చేసిన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం అభినందించిందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. నీతి అయోగ్ రెకమండ్ చేసిన విధంగా నిధులు కూడా ఇస్తే బాగుంటుందని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.