హమీర్పూర్ : బాలుడి వేధింపులు తాళలేక ఓ బాలిక శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వేధింపులు ఎదుర్కొన్న బాలిక కుటుంబం బాలుడి(16)కి దేహశుద్ధి చేసినట్లు తెలిపారు. కాగా ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. బాలికను తరచుగా వేధించేవాడని బాధిత కుటుంబం తెలిపిందన్నారు. సోమవారం కూడా వేధింపులకు గురిచేసినట్లు వెల్లడించారు.
ఈ విషయంలో పోలీసులు ఇప్పటికే ఓసారి హెచ్చరించి వదిలేశారన్నారు. వరుస వేధింపులతో బాలిక తట్టుకోలేక ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. మేజిస్ట్రేట్ ఎదుట బాలిక స్టేట్మెంట్ను రికార్డు చేశారు. బాధిత కుటుంబ ఫిర్యాదును అనుసరించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.