సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ నేపథ్యంలో వాహనాల ప్రవాహం పెరిగింది. దీంతో ట్రాఫిక్ రద్దీని, ప్రజా రవాణా ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ జంక్షన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న రోడ్డు వ్యవస్థ విస్తరించడంతో వాహన రద్దీ కూడా పెరిగింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు పోలీస్ శాఖ సమన్వయంతో నగర వ్యాప్తంగా 90 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు.
జంక్షన్ల విస్తరణ పనులు జోనల్ కమిషనర్ల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. 90 కూడళ్లలో భాగంగా 69 చోట్ల పనులు పూర్తి కాగా.. 11 పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. త్వరలో మరో14 కూడళ్ల పనులను ప్రారంభించనున్నామని చెప్పారు. ఖైరతాబాద్ జోన్లో అన్ని జోన్ల కంటే ఎకువగా జంక్షన్ల అభివృద్ధి చేపట్టారు. ఎల్ల్బీనగర్ జోన్లో మొత్తం 11 జంక్షన్ల విస్తరణ అభివృద్ధి చేపట్టగా ఏడు పూర్తయ్యాయి.
ఒకచోట పనులు నడుస్తున్నాయి. మూడు చోట్ల పనులు చేపట్టాల్సి ఉన్నదని అధికారులు చెప్పారు. అదే విధంగా, చార్మినార్ జోన్లో 9 చేపట్టగా ఏడు పూర్తి చేశారు. ఒకటి పురోగతిలో ఉన్నదని, మరో చోట పనులు మొదలు పెడతామన్నారు. ఖైరతాబాద్ జోన్లో 34 జంక్షన్లకు గాను 22 పూర్తి చేశామని, ఐదు చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని, ఏడు చోట్ల పనులు త్వరలో చేపడుతామని చెప్పారు. శేరిలింగంపల్లి 11 పనుల్లో ఏడు పూర్తి కాగా, మిగతా ఒక చోట పనులు పురోగతిలో ఉండగా మరో మూడు చోట్ల త్వరలో పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
కూకట్పల్లిలో 10 చోట్ల పనులు చేపట్టగా 9 పూర్తయ్యాయి. మరొకటి అభివృద్ధి దశలో ఉందన్నారు. సికింద్రాబాద్ జోన్లో మొత్తం 15 జంక్షన్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, 13 పూర్తి కాగా మరో రెండు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.