న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నది. ఇందుకోసం లగ్జంబర్గ్కు చెందిన ఎస్ఈఎస్ ఎస్ఏతో ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్టు జియో ప్లాట్ఫామ్స్ సోమవారం ప్రకటించింది. పలు చిన్నచిన్న ఉపగ్రహాల్ని అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా గిగాబైట్స్ లింక్స్ను డెలివరీ చేసి, ప్రతీ ప్రాంతంలో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడానికి వీలుపడుతుంది. ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్, భారతి ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్కు చెందిన వన్వెబ్తో ఇకనుంచి ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్ఫామ్స్ పోటీపడనుంది. శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎస్ఈఎస్కు రెండు వివిధ కక్ష్యల్లో 70కి పైగా శాటిలైట్లు ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లకు వీడియో, డాటా సర్వీసుల్ని అందిస్తున్నాయి. తాజాగా ప్రకటించిన జాయింట్ వెంచర్లో జియోకు 51 శాతం, ఎస్ఈఎస్కు 49 శాతం వాటా ఉంటుంది. ఈ జాయింట్ వెంచర్కు జియో యాంకర్ కస్టమర్గా ఉంటుంది. భారత్లో సర్వీసుల్ని అందించడానికి గేట్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇది నెలకొల్పుతుందని, అలాగే సేవల్ని, పరికరాల కోసం 10 కోట్ల డాలర్ల కాంట్రాక్టుపై జియో-ఎస్ఈఎస్ జాయింట్ వెంచర్తో సంతకాలు చేసినట్టు జియో ప్లాట్ఫామ్స్ తెలిపింది. ఫైబర్ ఆధారిత కనెక్టివిటీ విస్తరణ కొనసాగుతుందని, కొత్త వెంచర్ మల్టీ-గిగాబైట్ బ్రాడ్బ్యాండ్ వృద్ధిని వేగవంతం చేస్తుందని జియో డైరెక్టర్ అకాశ్ అంబానీ తెలిపారు.
గ్లాన్స్లో రూ.1,500 కోట్ల పెట్టుబడి
వీడియోలు, అడ్వర్టైజ్మెంట్లతో సహా మొబైల్ లాక్స్క్రీన్ కంటెంట్ను అందించే గ్లాన్స్ ప్లాట్ఫామ్లో 200 మిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 1,500 కోట్లు) పెట్టుబడి చేసి 17శాతం వాటాను తీసుకో నున్నట్టు జియో ప్లాట్ఫామ్స్ తెలిపింది. సింగపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్మొబి గ్రూప్ సబ్సిడరీ అయిన గ్లాన్స్లో సాఫ్ట్బ్యాంక్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇప్పటికే పెట్టుబడులు చేశాయి.