భారత మహిళల డబుల్స్ చరిత్రలో నయా అధ్యాయం ఆవిష్కృతమైంది! ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తొలిసారి మన అమ్మాయిల జంట సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రెండు దశాబ్దాల క్రితం తన తండ్రి టైటిల్ నెగ్గిన చోట.. పుల్లెల గాయత్రి గోపీచంద్ అదరగొట్టగా.. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ సెమీస్కు దూసుకెళ్లాడు. మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నించాం. ఎలాంటి ఒత్తిడి లేకుండా ముందుకు సాగాం. తొలి గేమ్లో ఓటమి పాలయ్యాక.. రెండో గేమ్లో 18-20తో వెనుకబడి ఉన్నప్పుడు కూడా ఆశలు వదులుకోకుండా పోరాడం.
-గాయత్రి గోపీచంద్
బర్మింగ్హామ్: జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్.. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటున్నది. నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న గాయత్రి కెరీర్లోనే అద్భుత విజయంతో ప్రతిష్ఠాత్మక టోర్నీ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంకర్ గాయత్రి-త్రిసా జాలీ జోడీ 14-21, 22-20, 21-15తో రెండో సీడ్ లీ షోహీ-షిన్ సేంగ్చన్ (కొరియా) జంటను చిత్తు చేసి సెమీస్లో అడుగుపెట్టింది. తద్వారా ఈ మెగాటోర్నీ డబుల్స్ సెమీఫైనల్కు చేరిన తొలి భారత మహిళల జోడీగా రికార్డుల్లోకెక్కింది. సింధు, శ్రీకాంత్, సైనావంటి సీనియర్ ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన చోట.. తొలిసారి బరిలోకి దిగిన బీడబ్ల్యూఎఫ్ సూపర్-1000 ఈవెంట్లో గాయత్రి-త్రిసా జాలీ ద్వయం అద్వితీయ ప్రదర్శన కనబర్చింది.
ఇటీవలి కాలంలో అద్వితీయ ప్రదర్శనతో దూసుకెళ్తున్న యువ భారత షట్లర్ లక్ష్యసేన్.. ఆల్ఇంగ్లండ్ చాంపియన్షిప్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ అండెర్స్ అంటొన్సెన్ (డెన్మార్క్)కు చుక్కలు చూపిన లక్ష్యసేన్కు.. శుక్రవారం క్వార్టర్ ఫైనల్స్లో వాకొవర్ లభించింది. గత మ్యాచ్లో గాయపడిన చైనా ఆటగాడు లూ జూంగ్ జూ కోర్టులో అడుగు పెట్టకపోవడంతో లక్ష్యసేన్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్లో భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ మాత్రమే సెమీఫైనల్కు అర్హత సాధించగా.. తాజా ఫలితంతో ఆ దిగ్గజాల సరసన లక్ష్యసేన్ చోటు దక్కించుకున్నాడు. శనివారం జరుగనున్న సెమీస్లో రెండో సీడ్ కెంటా మొమోటాతో లక్ష్యసేన్ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 22-24, 17-21తో మార్కస్ గిడెన్-కెవిన్ సంజయ జోడీ చేతిలో పరాజయం పాలైంది.