చింతలపాలెం, ఫిబ్రవరి 19 : చింతలపాలెం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు వార్డు మెంబర్ చింతిరాల సురేందర్ తన సొంత నిధులతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వార్డులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్తను గురువారం జెసిబి సాయంతో తొలగించి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి, వార్డు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేశారు. వార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని తన సొంత ఖర్చులతో సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ సురేందర్ చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమంపై వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన సేవలను అభినందించారు.