నీలగిరి, అక్టోబర్ 17: విశాఖ జిల్లా ఏజెన్సీలోని లంబసింగిలో ఆదివారం నల్లగొండ పోలీసులపై గంజాయి స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. పోలీసులు తేరుకొని గాల్లోకి కాల్పులు జరపడంతో పారిపోయారు. నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం గంజాయితోపాటు ఇతర మత్తు పదార్థ్దాల రవాణా, క్రయవిక్రయాలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఆంధ్రా నుంచి హైదరాబాద్తోపాటు మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు నల్లగొండ జిల్లా మీదుగా గంజాయిని తరలిస్తుండటంతో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. వీటితోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటంతో నిందితుల నుంచి సమాచారం సేకరించిన పోలీసులు విషయాన్ని ఎస్పీ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు. నల్లగొండ ఎస్పీ ఆదేశాలతో 17 బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. ఆంధ్రా, ఒడిశా సరిహ ద్దు ప్రాంతంలోని విశాఖ ఏజెన్సీలోని గంజా యి స్థావరాలపై దాడులు చేశారు. ఈ సమయంలో గంజాయి సాగు చేసేవారు, ఇతరులు పారిపోగా.. అక్కడ పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లంబసింగి వద్ద గం జాయి స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ క్రమంలో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడిచేశారు. ప్రతిఘటించేందుకు పోలీసులు గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరపగా వారు పరారైనట్టు ఎస్పీ తెలిపారు.