ముంబై: చచ్చిన దోమలున్న ప్లాస్టిక్ సీసాను ఒక గ్యాంగ్స్టర్ కోర్టుకు తెచ్చాడు. జైలులో విపరీతంగా దోమలు ఉన్నాయని చెప్పాడు. ఈ నేపథ్యంలో దోమల తెర వినియోగానికి అనుమతించాలని కోరాడు. అయితే అతడి విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు ఎజాజ్ లక్డావాలాపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2020 జనవరిలో అరెస్టైన అతడు నాటి నుంచి నవీ ముంబై సమీపంలోని తలోజా జైలులో ఉన్నాడు.
కాగా, జైలు గదిలో దోమల తెర వినియోగానికి అనుమతి కోసం గ్యాంగ్స్టర్ లక్డావాలా ఇటీవల కోర్టుకు దరఖాస్తు చేశాడు. గురువారం కోర్టు విచారణ సందర్భంగా చచ్చిన దోమలతో నిండిన ప్లాస్టిక్ సీసాను అతడు తీసుకెళ్లాడు. న్యాయమూర్తికి దానిని చూపించాడు. జైలులో తెగ దోమలు ఉన్నాయని, తనతోపాటు తోటి ఖైదీలు తెగ ఇబ్బంది పడుతున్నారని చెప్పాడు. ఈ నేపథ్యంలో దోమల తెర వినియోగించేందుకు అనుమతించాలని కోరాడు.
2020లో తాను అరెస్టైనప్పుడు దోమల తెర వినియోగానికి అనుమతించినట్లు లక్డావాలా కోర్టుకు తెలిపాడు. ఈ ఏడాది మే నెలలో భ్రదతా కారణాలతో ఆ దోమ తెరను జైలు అధికారులు తీసుకున్నారని ఆరోపించాడు. అయితే భద్రతా కారణాలను పేర్కొన్న జైలు అధికారులు, లక్డావాలాకు దోమల తెర అనుమతిని వ్యతిరేకించారు. దీంతో అతడి విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. ఓడోమోస్ వంటి వాటిని వినియోగించాలని సూచించింది.
మరోవైపు ఆ జైలులోని పలువురు ఖైదీలు కూడా దోమల తెరల కోసం కోర్టుకు ధరఖాస్తు చేశారు. అయితే కొందరు ఖైదీలకు కోర్టు అనుమతించగా, మరి కొందరికి తిరస్కరించింది. జైలులో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్లఖా కూడా దోమల తెర వినియోగానికి అనుమతి కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్లో దరఖాస్తు దాఖలు చేశారు. దానిపై కోర్టు విచారణ పెండింగ్లో ఉంది.