దక్షిణాదికి ‘రీజినల్ క్లినికల్ ట్రయల్ యూనిట్’గా ఎంపిక
హైదరాబాద్, డిసెంబర్ 30 : గాంధీ దవాఖాన మరో ఘనత సాధించింది. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రిసెర్చ్ (డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్’ (ఐఎన్టీఈఎన్టీ-ఇంటెంట్)కు గాంధీ దవాఖాన ఎంపికైంది. దక్షిణాది రాష్ర్టాలకు ‘రీజినల్ క్లినికల్ ట్రయల్ యూనిట్’గా (ఆర్సీటీయూ) ఎంపికై రికార్డు సాధించింది. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్ ట్రయల్స్, ఇతర పరిశోధనల ద్వారా తయారుచేసేందుకు ఐసీఎంఆర్, డీహెచ్ఆర్ సంయుక్తంగా ఇంటెంట్ పేరుతో ఒక నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇందులో గాంధీ దవాఖానను దక్షిణాదికి ఆర్సీటీయూగా ఎంపిక చేసింది. గాంధీలో అత్యాధునిక ఎండీఆర్యూ ఉన్నది. బయోకెమిస్ట్రీ, పాథాలజీ, జెనెటిక్స్ వంటి కీలక పరిశోధనలకు కావాల్సిన అత్యాధునిక పరికరాలున్న ఈ యూనిట్కు డాక్టర్ కే నాగమణి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు.