అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాదిన అరడజను ప్రాజెక్ట్లు ఆమె చేతిలో ఉన్నాయి. తీరికలేని బిజీ షెడ్యూల్స్లో ఉన్నప్పటికీ ఈ భామ తన అభిరుచి మేరకు ఓ వీడియో ఆల్బమ్లో నర్తించింది. ‘గాంధారి’ పేరుతో రూపొందిన ఈ వీడియో ఆల్బమ్ను ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆదివారం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆల్బమ్ తాలూకు ఓ పోస్టర్ను కూడా అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈ అమ్మడు సంప్రదాయ వస్త్రధారణలో వెలిగిపోతున్నది. తన హృదయానికి ఎంతో ఇష్టమైన గీతమాలిక ఇదని కీర్తి సురేష్ ట్విట్టర్లో వ్యాఖ్యానించింది. ఈ వీడియో ఆల్బమ్ను ప్రముఖ సంస్థలు సోనీ మ్యూజిక్ సౌత్, ది రూట్ నిర్మించాయి. పవన్ సీహెచ్ సంగీతాన్నందించారు. బృందా నృత్యరీతుల్ని సమకూర్చారు. కీర్తి సురేష్ తొలిసారి నర్తించిన ఈ వీడియో ఆల్బమ్ అభిమానుల్ని రంజింపజేస్తుందని, ఆమె అభినయం, నృత్యాలు ప్రత్యేకార్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో సర్కారు వారి పాట, భోళాశంకర్, దసరా చిత్రాల్లో నటిస్తున్నది.