హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలేస్తున్నారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ జిల్లా భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ప్రస్తుతం డ్యామ్లోకి 14,602 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి 14,096 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 358.50 అడుగుల మేర నీరుంది.