Reliance_Future | దేశంలోనే రెండో అతిపెద్ద రిటైలర్ ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా ఆదివారం ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను నిలిపివేసింది. ఫ్యూచర్ రిటైల్ లీజ్ ఒప్పందాల మేరకు ఆయా స్టోర్ల యాజమాన్యాలకు అద్దె చెల్లింపులో విఫలమైంది. అలా విఫలమైన ఫ్యూచర్ అనుబంధ బిగ్బజార్ స్టోర్లను రిలయన్స్ రిటైల్ టేకోవర్ చేసుకునే దిశగా అడుగులేస్తున్నది. ఆ స్టోర్ల యాజమాన్యాలతో లీజ్ ఒప్పందాలు చేసుకుని.. 200 స్టోర్లను రిలయన్స్ టేకోవర్ చేసుకుంది. రిలయన్స్ రిటైల్ బ్రాండ్తో వాటిని పునఃప్రారంభించింది. బిగ్ బజార్ సిబ్బంది పొందుతున్న వేతనాలను తమ కంపెనీ నుంచే ఆఫర్ చేస్తున్నది ముకేశ్ అంబానీ రిలయన్స్.
రెండు దశాబ్దాలుగా అతిపెద్ద రిటైల్ చైన్నెట్వర్క్తో రారాజుగా వెలుగొందిన కిశోర్ బియానీ ఆధ్వర్యంలోని బిగ్ బజార్, ఇతర షోరూమ్లు పరివర్తన దిశగా అడుగులేస్తున్నాయి. తాజా పరిణామంపై ఫ్యూచర్, రిలయన్స్ స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు, తమ కార్యకలాపాలను మూసేస్తున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో దాఖలు చేసిన ఫైలింగ్లో ఫ్యూచర్ తెలిపింది. రెండు రోజులు తమ స్టోర్లు మూసేస్తున్నామని తెలియచేయడానికి విచారిస్తున్నామంటూ బిగ్ బజార్ ట్వీట్ చేసింది. ఫ్యూచర్ ఈ-కామర్స్ మొబైల్ యాప్, వెబ్సైట్ కూడా ఆన్లైన్ ఆర్డర్లకు అందుబాటులో లేవు.
అప్పులు, నష్టాల నుంచి బయటపడేందుకు రిలయన్స్ రిటైల్లో విలీనానికి ఫ్యూచర్రిటైల్ 2020 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ అంతకుముందు 2019లో తమతో చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఫ్యూచర్ ఉల్లంఘిస్తుందంటూ అమెజాన్ న్యాయపోరాటానికి దిగింది. ఫ్యూచర్లో 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టామని పేర్కొంది. అయితే, తామేమీ తప్పేమీ చేయలేదని ఫ్యూచర్ వాదిస్తున్నది.
భారత్లోని ఉద్యోగులు, వినియోగదారులు, ప్రతి ఒక్కరూ బిగ్ బజార్ బ్రాండ్తో అనుబంధమై ఉన్నారు అని బిగ్ బజార్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్సీఎల్టీల్లో అమెజాన్ కేసుల విచారణ జరుగుతున్నది. కానీ, ఫ్యూచర్ అనుబంధ స్టోర్ల భూ యజమానులతో రిలయన్స్ రిటైల్ లీజ్ ఒప్పందం కుదుర్చుకోవడం.. అమెజాన్ వ్యూహం దెబ్బ తింటుందన్న సందేహాలు ఉన్నాయి. స్టోర్ల భూ యజమానులు స్వతంత్రంగా రిలయన్స్ రిటైల్కు లీజ్కు ఇస్తున్నారని ఈ వివాదంతో సంబంధం ఉన్న ఓ న్యాయవాది చెప్పారు. ఇలా రిలయన్స్ దూకుడుగా వెళుతుందని అమెజాన్ ఊహించి ఉండకపోవచ్చునన్నారు.