న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్లో విలీన ఒప్పందంపై ముందడుగు వేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ శనివారం దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా సింగపూర్ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన అత్యవసర ఆదేశాలను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్.. రిలయన్స్తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదని ఫ్యూచర్ రిటైల్ను ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
సింగిల్ బెంచ్ తీర్పును ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్స్ ఢిల్లీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ను ఆశ్రయించాయి. తాజాగా దాఖలు చేసిన అప్పీలును చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్లతో కూడిన డివిజన్ సోమవారం విచారణ జరుపనున్నది. అయితే, సింగిల్ బెంచ్ ఆదేశాల ప్రభావం ప్రస్తుతం ‘నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)’ ముందు పిటిషన్పై ఉండబోదని ఫ్యూచర్ గ్రూప్ పేర్కొనడం గమనార్హం.
రిలయన్స్ గ్రూప్తో కుదిరిన రూ.24,713 కోట్ల విక్రయ ఒప్పందం అమలు విషయంలో ముందుకు వెళ్లొద్దని ఢిల్లీ హైకోర్టు గురువారం కిశోర్ బియానీ నేతృత్వంలోని రిటైల్ జెయింట్ ఫ్యూచర్ గ్రూప్ను ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. సింగపూర్లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఆదేశాల్ని ఫ్యూచర్స్ రిటైల్ ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించిందని పేర్కొన్నది.
ఫ్యూచర్ గ్రూప్నకు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వ్యాపారాల కొనుగోలుకు రిలయన్స్ గతేడాది అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఫ్యూచర్ గ్రూప్కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్లో అమెజాన్ 2019లో 49 శాతం పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్లో వాటా ఉంది. దీంతో మూడేండ్ల నుంచి 10 ఏండ్ల లోపు ఫ్యూచర్ రిటైల్ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్కు లభించింది. అయితే, రిలయన్స్-ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నదని అమెజాన్ వాదిస్తున్నది. దీంతో సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టులో దీన్ని సవాల్ చేసింది.