బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. దీంతో మదుపరుల చూపు సహజంగానే పసిడిపై పడుతున్నది. ఈ క్రమంలోనే గోల్డ్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులకు ఏది ఉత్తమమన్న ప్రశ్న చాలామందిలో తలెత్తుతున్నదిప్పుడు. అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఉండటం వల్ల దొంగతనం, తరుగు లాంటి రిస్క్లు వీటిలో లేవు. పైగా ఈ రెండు సాధనాలు కూడా యూనిట్కు రూ.50లోపే ఉండటంతో మదుపు లేదా పొదుపు చేయడం చాలా సులువు. ఇక ఈ రెండింటిలో ఏది ఉత్తమం అన్న విషయానికొస్తే.. వాటి పనితీరు, నిర్మాణం, గతంలో అవి ఇచ్చిన రాబడులను పరిశీలించాల్సిందే..
గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్ను మిగతా మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే నేరుగా లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) ద్వారా కూడా నెలనెలా పొదుపు చేయవచ్చు. ఎంత చిన్నమొత్తాలనైనా మదుపు చేసుకోవచ్చు. గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్వోఎఫ్)లో గోల్డ్ ఫండ్ కొనాలంటే కనీసం రూ.5,000 పెట్టుబడి ఉండాలి. గోల్డ్ సేవింగ్స్ ఫండ్లను అమ్మాలంటే ఎగ్జిట్ లోడ్ను దాదాపు ఒక శాతం చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ గోల్డ్ సేవింగ్స్ ఫండ్లో మదుపు చాలా సులభం. గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ నిర్వహించే మ్యూచువల్ ఫండ్ సాధారణంగా గోల్డ్ ఈటీఎఫ్లలోనే మదుపు చేస్తుంది. అలాగే మరికొన్ని షార్ట్ టర్మ్ ఫండ్లలో కూడా మదుపు చేస్తుంది. కొత్తగా మదుపు మొదలు పెట్టాలనుకునేవారికి ఇవి ఉత్తమ సాధనాలు. అయితే గోల్డ్ సేవింగ్స్ స్కీమ్లు నేరుగా బంగారంలో కాకుండా ఈటీఎఫ్లలో మదుపు చేయడం వల్ల కొన్ని సందర్భాలలో రాబడిపై ప్రభావం చూపించవచ్చు.
గత మూడేండ్ల కాలంలో మదుపరులకు గోల్డ్ ఫండ్ ఏటా సగటున 13.49 శాతం రాబడిని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 7.78 శాతం రాబడి అందింది. అదే గోల్డ్ ఈటీఎఫ్లు గత నెల రోజుల్లో 13 శాతానికిపైగా రాబడిని ఇవ్వగా, ఐదేండ్ల కాలానికి ఏటా 14.4 శాతం రాబడిని ఇచ్చాయి.
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)లు కొనాలంటే డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఎందుకంటే ఇవి కూడా మ్యూచువల్ ఫండ్లే అయినప్పటికీ స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడ్ అవుతాయి. కనుక డీమ్యాట్ ఖాతా మదుపరికి ఉండాల్సిందే. ఇక గోల్డ్ ఈటీఎఫ్లో పెద్దదైన గోల్డ్ బీస్ ధర ప్రస్తుతం రూ.44.57. బ్రోకరేజితో కలిపి రూ.45 ఉంటే చాలు ఒక యూనిట్ను కొనుగోలు చేయవచ్చు. అమ్మడానికి గోల్డ్ ఈటీఎఫ్కు ఎగ్జిట్ లోడ్ ఏమీ ఉండదు. గోల్డ్ ఈటీఎఫ్లు నేరుగా బంగారంలోనే 90 శాతం నిధులను మదుపు చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వ బాండ్లలో మదుపు చేస్తాయి. భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండా ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్లో జమచేసే వీలుండటం గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో ఉన్న సానుకూలాంశం. అయితే డీమ్యాట్ అకౌంట్ ఉండాలన్న నిబంధన ఒక్కటే ప్రతిబంధకం. మదుపరులకు పాన్ కార్డు ఉండాల్సిందే. ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్లనూ దాఖలు చేయాలి. డీమ్యాట్ ఖాతాలో నెలకు కొన్ని యూనిట్ల చొప్పున కొనవచ్చు.
మొత్తంగా చూసినైట్టెతే ఈ రెండింటిలోనూ క్రమం తప్పకుండా వారివారి పెట్టుబడులకు అనుగుణంగా మదుపరులు మదుపు చేసుకోవచ్చు. ఈ రెండు సాధనాలూ రిస్క్ లేని పెటుబడి మార్గాలే.