హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్ )-2024 నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. ఈ నెల 6 నుంచి మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందేందుకు దోస్త్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. మూడు విడతల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత అడ్మిషన్లు పొందిన విద్యార్థులు జూన్ 29 నుంచి జూలై 7 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 6 వరకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు. జూలై 8 నుంచి ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు మహమూద్, వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాంవెంకటేశ్, ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, అంబేద్కర్ వర్సిటీల వీసీలు రవీందర్, రమేశ్, లక్ష్మీకాంత్ రాథోడ్, మల్లేశ్, సీతారామారావు పాల్గొన్నారు.
ఈ ఏడాది డిగ్రీలో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. 14 కాలేజీల్లో బీకాం ఫైనాన్స్, మరికొన్ని కాలేజీల్లో బీఏ (స్పెషల్) హెచ్ఈపీ, బీఎస్సీ బయోమెడికల్ సైన్స్, బీఏ పబ్లిక్పాలసీ అండ్ గవర్నెన్స్ కోర్సులను నిర్వహిస్తారు. 20 అటానమస్ కాలేజీల్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఏ)ను ఎలక్టివ్గా ప్రవేశపెడుతున్నారు. బీఎఫ్ఎస్ఏ కోర్సులో 5వేల మంది ఇంజినీరింగ్, మరో 5వేల మంది నాన్ ఇంజినీరింగ్ కోర్సుల వారికి అడ్మిషన్లు కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,066 డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 4,49,449 సీట్లున్నాయి.
రాష్ట్రంలోని అన్ని కోర్సులకు ఇంటర్న్షిప్లు అమలుచేసే యోచన చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదించి కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. ప్లేస్మెంట్స్, ఇంటర్న్షిప్ ఇచ్చేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయనిన్నారు. కొత్త కోర్సుల్లో బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని అమలుచేస్తామని చెప్పారు. ఈ కోర్సుల్లోని వారు ఆరు మాసాల పాటు పరిశ్రమల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. నాన్ దోస్త్ కాలేజీలను దోస్త్ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
డిగ్రీలో కోర్సులను మూసివేయడం, సీట్ల కోత విధించడంలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఆదరణ లేని కోర్సులకు బదులు మరో కోర్సు ఆఫర్చేసే అవకాశం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంటర్లో 3 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారని, కానీ డిగ్రీలో 4లక్షలకు పైగా సీట్లున్న విషయాన్ని గుర్తుచేశారు.