న్యూఢిల్లీ: హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలోని జహంగిర్పుర్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ హింస కేసులో ఢిల్లీ పోలీసులు 23 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మందికి నేర చరిత్ర ఉంది. దోషిగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీపీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. అయితే ఇవాళ మరోసారి జహంగిర్పుర్లో హింస చెలరేగింది. ఏప్రిల్ 16వ తేదీన జహంగిర్పుర్లో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోతో లింకున్న వ్యక్తిని ప్రశ్నించేందుకు సీడీ పార్క్లో ఉన్న అతనికి ఇంటికి వెళ్లారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులు పోలీసులపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
సోనూ చిక్నా అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, ఒకర్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం జహంగిర్పురిలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. 14 బృందాలుగా పోలీసులు నిందితుల కోసం వెతుకుతున్నట్లు డీసీపీ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా శాంతికి భంగం కలిస్తున్న వారిపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. అరెస్టు అయిన వారి నుంచి అయిదు గన్నులు, అయిదు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. అస్లమ్ అనే వ్యక్తి నుంచి దేశీయ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
హనుమాన్ జయంతి ఊరేగింపు సమయంలో మసీదు వద్ద కాషాయ జెండాను ఎగురవేసేందుకు ఎటువంటి ప్రయత్నం జరగలేదని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు.